శాస్త్రాల ప్రకారం సోమవారంతో కూడిన త్రయోదశి మరియు ఆరుద్ర నక్షత్ర యోగంలో పరమశివుడిని, నందీశ్వరుడిని దర్శించి అభిషేకం చేసుకోవడం వల్ల సర్వపాపాలు తొలగి, మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యప్రాప్తి కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ దివ్య సందర్బాన్ని పురస్కరించుకుని ఆలయంలో కొలువుదీరిన మరకత మహా శివునికి మరియు శ్రీ నందీశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, అలంకరణలు జరిపారు. మరకత మహా శివలింగానికి రంగురంగుల సుగంధ పుష్ప మాలలు, పట్టు వస్త్రాలు మరియు ఆభరణాలతో శోభాయమానంగా దివ్యాతిదివ్య అలంకరణ చేశారు.
ఈనాటి ప్రధాన ఘట్టంగా, అత్యంత మహిమాన్వితమైన ఆరుద్ర నక్షత్ర ప్రదోష వేళలో శ్రీ నందీశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారలతో కూడిన పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సుగంధ పుష్ప మాలలతో, శ్రేష్ఠమైన నూతన వస్త్రాలతో భక్తిభావంతో అలంకరించారు.
ఈ పవిత్రమైన వేడుకలో సాయి దుర్గా నగర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని, హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో ఆలయాన్ని మార్మోగించారు. భక్తులందరూ నందీశ్వర స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో అత్యంత భక్తిమయ వాతావరణం సంతరించుకుంది
No comments:
Post a Comment